నిరాశ్రయులకు చేయూత
కరీంనగర్: దైవ దర్శనానికి వెళ్లి నగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ దృష్టికి రాగా.. ఆయన వెంటనే తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని కరీంనగర్కు రప్పించే ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని రాంనగర్కు చెందిన ఓ కుటుంబం తమిళనాడులోని కాంచీపురం వెళ్లింది. దైవ దర్శనం అనంతరం మంగళవారం రాత్రి ఆలయం చెంత నిద్రించగా.. వారి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో బోరుమన్న ఆ కుటుంబీకులు స్థానికులకు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక బధిరుడు ఉండగా.. మరో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయానికి అక్కడి ఆలయ సిబ్బంది సమాచారమివ్వడంతో.. కేంద్ర మంత్రి సూచనతో వారిని క్షేమంగా కరీంనగర్ రప్పించే ఏర్పాట్లు కార్యాలయ సిబ్బంది చేశారు. వారికి అక్కడ భోజన వసతి కల్పించడంతోపాటు కరీంనగర్ వచ్చేందుకు వీలుగా రైలు టికెట్లు బుక్ చేయించారు. ప్రయాణ ఖర్చులను అందించారు.


