వినూత్న ఆలోచన.. లాభార్జన
● పుచ్చకాయ సాగులో యువ రైతులు
● వరి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా పంట
● వాట్సప్లో షేర్ చేస్తూ.. నేరుగా విక్రయాలు
జగిత్యాల అగ్రికల్చర్: సాధారణంగా యాసంగిలో చాలా మంది రైతులు వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుంటారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువరైతులు వినూత్నంగా ఆలోచన చేశారు. వరిసాగును వీలైనంత తగ్గించి, పుచ్చకాయ సాగుచేస్తూ.. పొందుతున్నారు. వచ్చిన పంటను కొందరు హోల్సేల్గా విక్రయిస్తుండగా, మరికొంతమంది నేరుగా వినియోగదారులకు అందిస్తూ.. లాభాలు పొందుతున్నారు.
శివరాత్రి నుంచి పంట మార్కెట్కు
పుచ్చకాయకు మహాశివరాత్రి నుంచి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దీంతో నవంబర్ నుంచి విత్తనాలు నాటారు. ఫిబ్రవరి నుంచి పంట మార్కెట్కు వచ్చి, మే వరకు కొనసాగనుంది. కొందరు కిలోకు రూ.15వరకు హోల్సేల్గా విక్రయిస్తుండగా, మరికొందరు వినియోగదారులకు నేరుగా కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 15–20 టన్నుల పంట రావాల్సి ఉండగా, ఈ సారి మారిన వాతావరణ పరిస్థితులతో, సస్యరక్షణ చర్యలు చేపట్టి ఎకరాకు 10–15 టన్నుల దిగుబడి తీశారు.
హైదరాబాద్లోని మాల్స్తో ఒప్పందాలు
జిల్లాకు చెందిన పలువురు రైతులు పంటను హైదరాబాద్లోని మాల్స్కు విక్రయించేలా ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన కాయలను జిల్లాకేంద్రంలోని శ్రీరామ చౌరస్తా వద్ద, కోరుట్ల, మెట్పల్లిలో వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఎర్ర కలర్ పుచ్చకాయే కాకుండా పసుపు, గ్రీన్ రంగుల పుచ్చకాయలు సైతం విక్రయిస్తున్నారు.
వాట్సప్లో
సమాచారం..
సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిరిపూర్కు చెందిన పోగుల నరేశ్, ముత్యంపేటకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, రాయికల్ మండలం అల్లూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డితో పాటు పలువురు యువకులు వినూత్నంగా ఆలోచన చేస్తూ పంటలు సాగు చేస్తుంటారు. ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తున్నారు. సాగు వివరాలే కాకుండా, పంటను మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో స్వల్పకాలంలో చేతికి వచ్చే పుచ్చకాయ పంట సాగు చేయాలని నిర్ణయించారు. ఓ పది ఎకరాల సాగుకు అవసరమైన మల్చింగ్ షీట్, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు సైతం ఒకే కంపెనీవి కొనుగోలు చేశారు.
వినూత్న ఆలోచన.. లాభార్జన


