Telangana Crime News: సిమెంట్‌ ఇటుక, చేతికడెంతో అతనిపై కిరాతకంగా..
Sakshi News home page

సిమెంట్‌ ఇటుక, చేతికడెంతో అతనిపై కిరాతకంగా..

Aug 18 2023 1:36 AM | Updated on Aug 18 2023 5:39 AM

- - Sakshi

కరీంనగర్‌: మద్యం మత్తులో మాటమాట పెరిగి యువకుడి మర్డర్‌కు దారితీసిందని టౌన్‌ ఏసీపీ నరేందర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ రాంనగర్‌లోని ఓ వైన్స్‌ పర్మిట్‌రూంలో బుధవారం రాత్రి జరిగిన హత్యకేసులో టూటౌన్‌ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హత్యకు సంబంధించిన వివరాలు గురువారం టౌన్‌ ఏసీపీ నరేందర్‌ టూటౌన్‌ సీఐ రామచందర్‌రావుతో కలిసి టూటౌన్‌లో వెల్లడించారు.

ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం ఎలగందుల్‌ గ్రామానికి చెందిన చేపూరి పవన్‌(36) వెల్డింగ్‌ పనులు చేస్తూ రాంనగర్‌లోని చేపలమార్కెట్‌ సమీపంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే విధులు ముగించుకుని బుధవారం రాత్రి రాంనగర్‌లోని వైన్స్‌కు వెళ్లాడు. పర్మిట్‌రూంలో మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన కామెర అరుణ్‌(20), ఎండీ.ఆఫ్రిద్‌(21)తో గొడవ జరిగింది.

మాటమాట పెరగడంతో అరుణ్‌, ఆఫ్రిదిలు తమ స్నేహితులైన బచ్చల ప్రణయ్‌కుమార్‌(20), కల్వల పృథ్వీ(20), గాజుల ప్రేంకుమార్‌(21), విజయ్‌, లోకేష్‌ను అక్కడికి పిలిపించారు. వారందరూ కలిసి పవన్‌పై సిమెంట్‌ ఇటుక, చేతికడెంతో దాడిచేశారు. పర్మిట్‌రూం సిబ్బంది, పవన్‌తో వచ్చినవారు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్‌ మృతిచెందాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు.

గురువారం అరుణ్‌, ఆఫ్రిది, బచ్చల ప్రణయ్‌కుమార్‌, కల్వల పృథ్వీ, గాజుల ప్రేంకుమార్‌ను అరెస్టు చేశారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. యువత మద్యంమత్తులో నేరాలకు పాల్పడుతున్నారని, పర్మిట్‌రూముల నిర్వాహకులు నిబంధనలు పాటించి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, చిన్న గొడవ జరిగినా.. పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement