సుభాష్నగర్ : దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై) లక్ష్యమని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ ధర్మపురి పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎంపీ అర్వింద్ వర్చువల్గా విన్నారు. అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో పీఎంవీబీఆర్వై పథకాన్ని 2047 లక్ష్యమే సాధనగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగుల సృష్టి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈపీఎఫ్వో ద్వారా కేంద్రం మొదట ఉద్యోగంలో చేరిన వారికి రూ.15 వేల ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో నిజామాబాద్ ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 764 మంది ఉద్యోగులకు సుమారు రూ.15.71లక్షలు లబ్ధి పొందారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచి, ఉద్యోగులకు, యజ మానులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే కేంద్ర ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహక పథకం పీఎంవీబీఆర్వై అని ఎంపీ తెలిపారు.


