● రూ. 21,660 నగదు,
స్కూటీ స్వాధీనం
● పరారీలో మరో నిందితుడు
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని సాయిఅయ్యప్ప దేవాలయంలో రెండు రోజుల క్రితం జరిగిన హండీ చోరీ కేసును ఛేదించినట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 21,660 నగదు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కోటగిరి పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం రుద్రూర్ నుంచి స్కూటీపై వస్తున్న వ్యక్తి పోలీసులకు చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకొని విచారించారు. పోలీసుల విచారణలో ఈ నెల 17న ఏడుకొండలు అనే వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడినట్లు నిందితుడు రాజు అంగీకరించాడు. నిందితుడు ఏడుకొండలు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో ఎస్సై శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ బస్వంత్ రావ్, కానిస్టేబుల్ యాదగిరి కీలకపాత్ర పోషించారని, అరెస్ట్ చేసిన కోటగిరి పోలీసులను ఏసీపీ అభినందించారు.


