● స్వార్థాన్ని వీడి దేశ హితం కోసం
ఆలోచించాలి
● హర్యానా మాజీ గవర్నర్
బండారు దత్తాత్రేయ
కామారెడ్డి టౌన్ : దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ స్వయంసేవకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించానని, బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా నేర్చుకున్న దేశభక్తి, క్రమశిక్షణ, సంస్కారాలే తనను నిరంతరం నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. అందరూ స్వార్థాన్ని వీడి దేశ హితం కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎలాంటి గుర్తింపు, పదవులు లేని రోజుల్లో, కష్టకాలంలోనూ కేవలం దేశం కోసం నిలబడి సంఘకార్యాన్ని విస్తరించిన నాటి తరం కార్యకర్తల త్యాగాలు అమోఘమైనవని కొనియాడారు. తనకు కామారెడ్డితో చాలా అనుబంధం ఉందని, గతంలో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పని చేశానని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు రంజిత్మోహన్, నీలం చిన్నరాజులు, మురళీధర్గౌడ్, జంగం నరేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


