రుద్రూర్ : కోటగిరి శివారులోని అయ్యప్ప స్వామి, సాయిబాబా ఆలయాల్లో బుధవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి గర్భగుడిలోని రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. దేవాలయం సమీపంలోని కాలువ వద్ద హుండీల తాళాలు పగులగొట్టి అందులోని నగదును తీసుకుని పరారయ్యారు. ఉదయం ఆలయ నిర్వాహకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కార్యదర్శి నిశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్సై తెలిపారు.
శాంతినగర్లో..
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని 5వ టౌన్ పోలీస్స్టేషన్ పరిధి శాంతినగర్లో చోరీ జరిగినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కాలనీలోని అజుమారీ బేగం మంగళవారం తన తల్లి, తండ్రి, కూతురుతో నిద్రపోయింది. బుధవారం ఉదయం లేచేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించింది. బీరువాలోని రూ.40 వేల నగదు, ఆరు గ్రాముల బంగారం, మరొక బీరువాలోని రూ.80 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


