డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): డిచ్పల్లి మండలంలోని సీఎంసీ మెడికల్ కాలేజ్ నిర్వహణకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ (సీఎస్ఈటీఏ) మెదక్ డయాసిస్ మెడికల్ బోర్డు ఎవరితో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)చేసుకోలేదని బోర్డు కన్వీనర్ దయానంద్ స్పష్టం చేశారు. సీఎంసీ హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది సీఎంసీ మెడికల్ కాలేజ్కు చైర్మన్నని ప్రచారం చేసుకున్న షణ్ముకలింగంకు ఎవరూ సహకరించవద్దని అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిచ్పల్లి సీఎంసీకి త్వరలోనే నర్సింగ్ కళాశాల మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ నర్సింగ్,జనరల్ నర్సింగ్,ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులకు వారం పది రోజుల్లో అనుమతి వస్తుందని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ఫ్యాకల్టీకి వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అడ్వైజర్ కేవీ ప్రసాద్, సీఎంసీ హాస్పిటల్ గౌరవ డైరెక్టర్ అజ్జశ్రీనివాస్, సీఎస్ఐ గోదావరి డీసీసీ చైర్మన్ రెవరెండ్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.


