డిచ్పల్లి: మండలంలోని సుద్దులం గ్రామంలో శుక్రవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన ఈదురుగాలులకు గ్రామశివారులోని పంట పొలాల వద్ద 9 చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి నేలకొరిగాయి. కరెంట్ వైర్లు తెగిపోయి నేలపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుద్దులం – రామడుగు క్రాస్ రోడ్డు నుంచి గ్రామానికి వెళ్లే దారిలో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న బర్దిపూర్ విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ రాజేందర్రెడ్డి గ్రామాన్ని సందర్శించి విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిన కరెంట్ వైర్లను పరిశీలించారు. ఒక లైనుకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మిగిలిన ప్రాంతాలకు పునరుద్ధరించారు. రెండు రోజుల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


