ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు..
● పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు
● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో
భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు
నందిపేట్/ఆర్మూర్టౌన్/బాన్సువాడ/దోమకొండ/లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నందిపేట మండలంలోని తల్వేద ప్రాథమికోన్నత పాఠశాలలో 1996–97లో 7వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే లింగంపేట మండలంలోని పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో 2006–07 నుంచి 2019–20 వరకు బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు..


