
అడవులను ఆక్రమించనివ్వొద్దు
వర్ని: అడవులను ఆక్రమించనివ్వొద్దని, పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు పాల్పడే వారిపై అటవీశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మోస్రా, చందూర్ మండలాల్లో ఆదివారం ఆమె పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. చందూర్లో లబ్ధిదారులకు రేషన్కార్డులు, మండల మహిళా సమాఖ్యకు రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటికే అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి ఇబ్బంది కలిగించకుండా సంయమనం పాటించాలని సూచించారు. మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీలో అద్దె బస్సులను పెట్టించి ప్రతి నెలా రూ.70 వేల ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆదాయ వనరును సృష్టించామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి డ్వాక్రా సంఘాల్లో రుణాలు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు సురేశ్బాబా, శ్యామల, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్గౌడ్, లావణ్య, మాజీ జెడ్పీటీసీలు అంబర్సింగ్, హరిదాసు, గంగారాం, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
ఇప్పటికే సాగు చేసుకుంటున్నవారికి
ఇబ్బందులు కలిగించొద్దు
పర్యావరణానికి హాని కలిగించే
వారిపై చర్యలు తీసుకోండి
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క