
నిబంధనలు తూచ్!
బాన్సువాడ: బీర్కూర్ మండలంలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మంజీర ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వేల ట్రాక్టర్ల ఇసుక పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించాలని భావించినప్పటికీ ఇసుకాసురులకు మాత్రం వరంలా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బీర్కూర్ మండలంలోని బీర్కూర్, చించొల్లీ, కిష్టాపూర్, బరంగెడ్గి, దామరంచ మంజీర ప్రాంతాల నుంచి ఉచిత ఇసుక కోసం అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక క్వారీల విషయంలో కఠిన నియమావళి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పనులకు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరలో ఇసుక లభ్యత ఉండాలని కలెక్టర్లకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రైవేటు ఇళ్లు, ఇతర నిర్మాణాలకు ట్రాక్టర్కు రూ.900 చలాను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 10 ట్రాక్టర్లకు చలాన్లు చెల్లించి వందల ట్రాక్టర్లు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఈ డీడీ చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్ యజమానులతో మాట్లాడుకుని ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలను దగ్గర పెట్టుకుని ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఎంత మోతాదులో ఇసుక అవసరముంటుందో అన్ని ట్రాక్టర్లు మాత్రమే పంపించాలి. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ట్రాక్టర్ల యజమానులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసమేనంటూ ఇసుక తరలిస్తూ ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. బీర్కూర్, బరంగెడ్గి, చించొల్లీ, కిష్టాపూర్, దారమంచ గ్రామాల నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను బాన్సువాడ, వర్ని, నస్రుల్లాబాద్, గాంధారి మండలాలకు తలిస్తున్నారు. ఇందుకు బీర్కూర్ తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ అధికారి చలాన్ల కోసం కట్టాల్సిన డబ్బులు ఫోన్పేల ద్వారా తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అనుమతి కోసం..
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యం
అడ్డగోలుగా తరలింపు
అధికారుల పర్యవేక్షణ కరువు
ఇసుక కావాల్సిన వారు ముందుగా పంచాయితీ కార్యదర్శి, ఆర్ఐ, నాయబ్ తహసీల్దార్, లేని పక్షంలో తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులు గ్రామాలు, పట్టణంలో ఇళ్లు నిర్మిస్తే పంచాయితీ, మున్సిపాలిటీ నుంచి అనుమతి పత్రంతో ఇసుక పొందే వీలుంది. ఇక ప్రభుత్వ అభివృద్ధి పనులకు పని పత్రాలు చూపి ఇసుకను పొందవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక పొందవచ్చు. అధికారులు దగ్గరుండి ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేయాలి. వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత తహసీల్దార్ అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత నిర్దేశించిన మొత్తాన్ని బ్యాంకులో చలాన్ రూపంలో చెల్లించాలి. దాని ఆధారంగా సైట్లో ఇసుక నిర్ణీత సమయంలో తీసుకెళ్లాలి. పైకి ఈ నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా జరుగుతున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.