ధరూరు: రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు ఇస్తే కమీషన్లు రావని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు రూ.లక్షల కోట్లు ఇస్తే కమీషన్లు వస్తాయనే ఆలోచన తప్ప పల్లెల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఘనత కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరితతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇంటికి అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి.. అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ ఆ తర్వాత కమీషన్ల పేరుతో రూ.లక్షల కోట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. యుజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కులం, మతం తేడా లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, నేడు రేవంతరెడ్డి ఆ పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ పాక్రజెక్టుల నిర్మాణ కోసం తమ బంగారం లాంటి భూములు, ఇళ్లు సర్వస్వం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తి విఫలమవుతున్నాయన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. తన హయాంలోనే ఈ గ్రామానికి 236 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇందులో సుమారు 50 ఇళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ గద్వాల జిల్లా అన్ని విధాలుగా వెనుకబడిందని, అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరారు. ఈ క్రమంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజీవ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాజశేఖరరెడ్డి, సుదర్శన్రెడ్డి, శ్రీధర్, రఘువర్ధన్రెడ్డి, విజయ్కుమార్, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మహిళలకు
ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్సే
సొంతింటి కలను సాకారం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే..
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం


