గద్వాల/ధరూరు: మండలంలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో మొత్తం 256 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 50 నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 200 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ర్యాలంపాడుకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మాజీ వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలి
ధరూరు: విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ధరూరు మండలంలోని చింతరేవుల, ఎములోనిపల్లి, నర్సన్దొడ్డి తదితర గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అందరికీ నోట్, పాఠ్యపుస్తకాలు అందాయా అని ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు బేస్లైన్ టెస్టు నిర్వహించి.. వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి ఫలితాలు మెరుగుపడేలా చూడాలని తెలిపారు. డీఈఓ వెంట ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు.


