నా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే, నా పేరిట ఇదివరకే ఇల్లు మంజూరైనట్లు చూపెడుతుందని అధికారులు రిజెక్ట్ చేశారు. వాస్తవానికి నాపేరిట ఇల్లు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు. దీనిపై కలెక్టర్కు విచారణ జరిపి, మాకు న్యాయం చేయాలి.
– అమీన, క్యాతూరు, అలంపూర్ మండలం
రక్షణ కల్పించాలి..
నా తల్లిదండ్రులు చనిపోయారు. మేము నలుగురం పిల్లలం. నేను దివ్యాంగురాలిని కావడంతో నా కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక బయటకొచ్చి బతుకున్నా. అక్కడికి వచ్చి నన్ను హింసకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను. ఒంటరిగా ఉన్న నాకు రక్షణ కల్పించాలి.
– లక్ష్మి, దివ్యాంగురాలు, గద్వాల
పింఛన్ ఆపేశారు..
నాకు రెండు చెవులు పూర్తిగా వినిపించవు. ఇందుకు సంబంధించి సదరం సర్టిఫికెట్ కూడా తీసుకున్నా. కొంతకాలం పాటు పింఛన్ వచ్చింది. అయితే ఇటీవలి నాకు తెలియకుండా పింఛన్ ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలియదు. నాకు మళ్లీ పింఛన్ వచ్చేట్లు చేయండి.
– లక్ష్మీదేవమ్మ,
విఠలాపురం, మల్దకల్ మండలం
ప్రభుత్వ స్థలం ఆక్రమణ..
జింకలపల్లి శివారులో ప్రభుత్వానికి సంబంధించిన 10శాతం స్థలాన్ని కొందరు ఆక్రమించి, నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడి, ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.
– పెద్ద మద్దిలేటి,
సర్పంచ్, జింకలపల్లి, ఎర్రవల్లి మండలం


