మల్దకల్/కేటీదొడ్డి: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలంలోని ఎల్కూరు, తాటికుంట, సద్దలోనిపల్లి, కేటీదొడ్డి మండలంలోని చింతకుంట, ఇర్కిచేడు, మైలగడ్డ గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలోని ప్రజాపాలనలో సాకారమవుతోందన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 2వేల ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మిగతా లబ్ధిదారులు త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని.. బిల్లులు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, నాయకులు రాజారెడ్డి, చక్రధర్రెడ్డి, గోపాల్రెడ్డి, కృష్ణారెడ్డి, విజయ్, ఉరుకుందు, చంద్రశేఖర్, తాయప్ప, విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు.


