ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన లిఫ్ట్–1 గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులకు ఇంజినీర్లు శ్రీకారం చుట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుడ్డెందొడ్డిని సందర్శించిన విషయం తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద డీపీఆర్ సర్వే పనులను ప్రారంభించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అక్కడికి చేరుకొని ఇంజినీర్లతో మాట్లాడారు. 15 టీఎంసీల సామర్థ్యానికి రిజర్వాయర్ను పెంచుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అదే సమయంలో గుడ్డెందొడ్డి గ్రామస్తులు అక్కడికి చేరుకొని తమ గ్రామానికి ముంపు ముప్పు లేకుండా చూడాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గుడ్డెందొడ్డికి ఎలాంటి ముంపు ముప్పు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గుడ్డెందొడ్డి రఘువర్ధన్రెడ్డి, కురుమన్న ఉన్నారు.


