మల్దకల్: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్ఓ డా.సంధ్యా కిరణ్మయి అన్నారు. గురువారం మల్దకల్ పీహెచ్సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ముఖ్యంగా హెచ్ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవి వడదెబ్బ బారినపడే అవకాశం ఉన్నందున.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ఆమె సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట పీహెచ్సీ డాక్టర్ స్వరూపరాణి, ప్రసూనరాణి, జయమ్మ, రాజు, డీపీహెచ్ఎన్ వరలక్ష్మి ఉన్నారు.


