కౌన్సిలర్లను కులం పేరుతో దూషించారన్న మంజుల
కౌన్సిలర్లలతో ప్రాణహాని ఉందన్న రాజయ్య
రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ వర్సెస్ కమిషనర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. కౌన్సిలర్లను కులం పేరుతో దూషిస్తున్నారని చైర్పర్సన్ అంటుంటే...వారితో ప్రాణహాని ఉందని కమిషనర్ అంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వకపోగా.. వారిని కులం పేరుతో దూషిస్తే చూస్తూ ఊరుకోవాలా అని వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు.
గురువారం వడ్లేపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనువాసులుతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. కో ఆప్షన్ ఎన్నిక సందర్భంగా తాము ప్రతిపాదించిన వారి వివరాలు అందించేందుకు వెళితే.. కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని, కో ఆప్షన్ ఎన్నిక నామినేషన్పై పలు అనుమానాలున్నాయని అడగ్గా, సక్రమంగా స్పందించ లేదన్నారు.
గతంలో కమిషనర్ వసూళ్లపై ఫిర్యాదు చేశామని, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన అక్రమ కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. ఏడవ వార్డు కౌన్సిలర్ విజయ్ భాస్కర్ తనను కులం పేరుతో దూషించారని కమిషనర్ రాజయ్యపై శాంతిగనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఎస్ఐ నాగశేఖర్ రెడ్డితో మాట్లాడ గా..ఫిర్యాదు అందిందని విచారణ చేపట్టామని తెలిపారు.
దాడికి యత్నించారు
మున్సిపల్ కమిషనర్ రాజయ్య తనకు ప్రాణహాని ఉందని గురువారం శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వడ్డేపల్లి మున్సిపాలిటీలో రెండు నెలల క్రితం ఏఐఎఫ్బీ పార్టీ తరఫున గెలిచిన వడ్డేపల్లి శ్రీనువాసులు వర్గానికి చెందిన కౌన్సిలర్లు కొందరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తనను బెదిరించారని ఆరోపించారు. గురువారం తాను కార్యాలయంలో ఉండగా 50 మంది తన చాంబర్లోకి దూసుకొచ్చి దాడి చేసేందుకు యత్నించారన్నారు.


