శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించి.. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ ఎన్నికల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లను ముందస్తుగా అరెస్టు చేసి బైండోవర్ చేయాలన్నారు. వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటివి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు కల్యాణ్కుమార్, శ్రీకాంత్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు పాల్గొన్నారు.


