మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: పోలింగ్ నిర్వహణ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు ఏవైనా సందేహాలుంటే వెంటనే శిక్షకులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎన్నికల హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా అమలు చేయాలన్నారు. ఎలక్ట్రోరల్ ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ ఓటుహక్కు కల్పించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీల గుర్తులతో పోటీ చేస్తున్నందున అధికారులు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. అంతకు ముందు మాస్టర్ శిక్షకలు పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల జనరల్ పరిశీలకులు చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీడీసీఓ నాగేంద్రం, నోడల్ అధికారులు రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా విధులు..
ఓటరు జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు సూపర్వైజర్లు, బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం జిల్లాలోని ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 54.87 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తిచేశామన్నారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లకు లక్ష్యాలు కేటాయించి క్షేత్రస్థాయిలో వేగంగా ప్రక్రియ కొనసాగేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


