మున్సిపాలిటీలు..
నామినేషన్లు
గద్వాల/ గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 408 నామినేషన్లు దాఖలయ్యాయని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులకు గాను మొత్తం 45 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో బీఎస్పీ పార్టీ నుంచి 1, బీజేపీ 8, సీపీఐ (ఎం) 1, కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 13, జనసేన 2, నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 37 వార్డులకు గాను 232 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో ఆప్ నుంచి 1, బీఎస్పీ 1, బీజేపీ 40, సీపీఐ 1, కాంగ్రెస్ 42, ఎంఐఎం 5, బీఆర్ఎస్ 30, జనసేన 5, ఫార్వర్డ్ బ్లాక్ 2 నామినేషన్లు దాఖలయ్యాయి. అయిజ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 80 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీఎస్పీ నుంచి 4, బీజేపీ 18, కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 30, జనసేన 1, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ నుంచి 1 నామినేషన్లు వచ్చాయి. అదేవిధంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులకు గాను 51 మంది అభ్యర్థులు నామినేషన్లు వచ్చాయి. ఇందులో బీజేపీ నుంచి 11, కాంగ్రెస్ 12, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 13, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 12 నామినేషన్లు దాఖలు అయినట్లు పేర్కొన్నారు. మొత్తంగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 77 వార్డులకు గాను 408 మంది అభ్యర్థులు 408 నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు.
ప్రత్యర్థి పార్టీల గాలం..
సొంత పార్టీపై కోపంగా ఉన్న వారికి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు గాలం వేస్తున్నారు. ప్రధానంగా గద్వాలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా వార్డులలో రెబల్స్ బెడద ఉంది. టికెట్ రాని కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్కు 3, 6, 8, 20 వార్డులలో రెబల్స్ బెడద ఏర్పడింది. బీజేపీకి 8, 23 రెబల్స్ బెడద తప్పడం లేదు. తమ సత్తా ఏమిటో ఎన్నికలలో చూపిస్తామని ఆయా పార్టీల్లోని రెబల్స్ నాయకులు సవాల్ విసురుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వానికి ముందే ఇతర పార్టీల వారిని లోపాయికారీగా మద్దతు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీపడుతున్నాయి. వివిధ వార్డుల్లో ప్రాబల్యం ఉన్న మైనార్టీల ఓటర్లను పిలుచుకొని మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నాయకులు.. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులలో టికెట్ రాని వారితోపాటు అసంతృప్తితో ఉన్న నాయకులను కలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు సమయం చిక్కినప్పుడల్లా కొందరు ముఖ్య నాయకుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారితో సంప్రదింపులు మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వార్డుల వారీగా అలిగిన నాయకుల ఇళ్లకు దూతలను పంపుతూ సర్దిచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. నాయకుల మద్దతును కూడగట్టుకోవడానికి అన్ని పక్షాల నేతలు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.


