ప్రోత్సాహం ఏది..? | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహం ఏది..?

Jun 18 2025 3:43 AM | Updated on Jun 18 2025 3:43 AM

ప్రోత్సాహం ఏది..?

ప్రోత్సాహం ఏది..?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వేధిస్తోన్న పీడీల కొరత

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల ఇంటర్‌ బోర్డుకు నివేదించాం. అందుకు ఇంటర్‌ బోర్డు సానుకూలంగా స్పందించింది. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తాత్కాలిక పద్ధతిపై వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

– హృదయరాజు,

జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి

నియామకాలు చేపట్టాలి

గత కొన్నేళ్లుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడం వలన క్రీడా ప్రమాణాలు తగ్గుతున్నాయి. పాఠశాల స్థాయిలో క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా.. కళాశాలలకు వచ్చేసరికి ప్రోత్సాహం అందడంలేదు. క్రీడలు సైతం అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. తక్షణమే జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పీడీలను నియమించాలి.

– విజయ రాణి, ఇంటర్‌ విద్యార్థిని, గద్వాల

గద్వాల టౌన్‌: విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రసంగాలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో క్రీడా ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. ప్రభుత్వం డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో మాత్రం వ్యాయామ అధ్యాపకుల నియామకాలపై దృష్టి సారించడం లేదు. క్రీడలను చదువులో అంతర్భాగం చేసుకోవడమే కాకుండా పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని అటు ప్రభుత్వాలు, ఇటు క్రీడా పండితులు యోచిస్తున్నా అమలులో అడుగు ముందుకు పడలేదు.

ఒక్క వ్యాయామ అధ్యాపకుడూ లేడు..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పీడీలు లేని కళాశాలల సంఖ్య రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మల్దకల్‌, మానవపాడు, అలంపూర్‌, ధరూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మాత్రమే వ్యాయామ అధ్యాపకుల పోస్టులకు మంజూరయ్యాయి. గతంలో ఆయా కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు ఉన్నా.. క్రమంగా బదిలీలు, ఉద్యోగ విరమణతో ప్రస్తుతం ఒక్కరూ కూడా లేరు. ప్రభుత్వం ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. ఆ తర్వాత గద్వాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, అయిజ, గట్టు ప్రభుత్వ కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు పోస్టులు మంజూరయ్యాయి. పోస్టులు మంజూరైనప్పటి నుంచి ఈ కళాశాలలో పీడీల నియామకం జరగలేదు. ప్రస్తుతం జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకుండానే బోధన జరుగుతోంది. ప్రతిసారి కళాశాల స్థాయిలో పోటీల నిర్వహణపై జరుగుతున్నా.. సమావేశాలలో మన జిల్లా తరపున ఒక్కరూ కూడా పాల్గొనడం లేదు. దీంతో జిల్లాలో నిర్వహించే కళాశాలల స్థాయి పోటీలు నిర్వహణ కలగా మారుతోందని, పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు.

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నా.. విద్యార్థులకు ప్రోత్సాహం కరువు

జిల్లాలోని 8 కళాశాలల్లో ఒక్క పీడీ లేని వైనం

అడుగంటుతున్న క్రీడా ప్రమాణాలు

డిగ్రీ కళాశాలల్లో..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వ్యాయామ అధ్యాపక ఖాళీలు కొన్నేళ్ల నుంచి భర్తీ కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలతో పాటు 3 ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఒక్క ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టు మంజూరైంది. అయితే, పదేళ్లుగా ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండగా.. ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. వందల సంఖ్యలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికి తర్ఫీదు ఇచ్చే పీడీ లేకుండా పోయారు. గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కలశాలలో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. డిగ్రీ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను నియమించి క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement