
అంగన్వాడీల్లో మౌలిక వసతులు కల్పించండి
గద్వాల: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు సురక్షితంగా ఉండే విధంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యలయంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు శుభ్రమైన వాతావరణంలో పూర్తిగా సురక్షితంగా ఉంచాలని, సొంత భవనం అద్దె భవనం అన్న తేడా లేకుండా నిర్మాణ లోపాలు పగుళ్లు ప్రమాదకరమైన పరిస్ధితులు తేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా సంక్షేమ అధికారి సునంద తదితరులు ఉన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించండి
ఎర్రవల్లి: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ అన్నారు. మంగళవారం మండల ంలోని కొండేరులో గల అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావుతో కలిసి ఆమె సందర్శించి చిన్నారుల హాజరుశాతం పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. నిత్యం చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం గురించి ఆరా తీసి వారితో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు బోధించే విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకొని వాటిని కొంతమేరకు పెంచాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అందించే నాణ్యమైన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా చిన్నారులకు అందించి వారు ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి గ్రామాలలో స్నేహ కమిటీలు నిర్వహిస్తున్న పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలపై లైంగిక వేధింపుల వంటి అంశాలపై విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీడీ నర్సింములు, సిడిపీఓ సుజాత, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ఖాన్, అంగన్వాడీ సూపర్వైజర్ జయ్యమ్మ, ఏపీఎంలు కోటేశ్వరి, ఎల్లప్ప, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, వైద్య సిబ్బంది, సీసీలు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.