భూ భారతి సదస్సులను వినియోగించుకోండి
ఇటిక్యాల: రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని మొగిళిరావులచెర్వు గ్రామంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆర్డీఓ పాల్గొని రైతుల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రారంభించిందని, జిల్లాలోని ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని వివరించారు. గతంలో ప్రజలు అధికారులను కలవాల్సి వచ్చేదని, ఇప్పుడు అధికారులే గ్రామాల్లోకి వచ్చి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి నెలాఖరులోగా అర్హులైన వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని, రైతులు నిర్దేశిత ప్రొఫార్మాలో దరఖాస్తులు అందించాలని సూచించారు. ఈ సదస్సులో భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నంబర్ గల్లంతు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ తదితర సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, పంచాయతీ కార్యదర్శి హారిక, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


