ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
గద్వాల రూరల్: పలు సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని.. ఎలాంటి అలసత్వం వహించొద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలోని ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గద్వాల, గట్టు, అయిజ, ఉండవెల్లి, ధరూర్ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల నుంచి వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులను ఆయా తహసీల్దార్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఏఓ యాదగిరి, సూపరింటెండెంట్ రాజు, మధున్ మోహన్, అధికారులు తదితరులు ఉన్నారు.
సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలి
యువతీ, యువకులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ దేశానికి ఎంతో ఆవసరమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన యువ ఉగాది ఉత్సవాలకు యూత్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో వివిధ డిగ్రీ కళాశాలల నుంచి 10మంది యువతీ, యువకులకు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యువతీ, యువకులు మంచి అలవాట్లు, ఆరోగ్యం, లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, తద్వారా సామాజిక ఆభివృద్ధికి దోహదపడాలన్నారు. రమేష్, తేజస్వీ, వర్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
‘ప్రజావాణి’కి 109 ఫిర్యాదులు