1,09,854 ఎకరాల్లో సాగు అంచనా
భూపాపపల్లి రూరల్: కొన్ని రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. సన్న వడ్లను సాగు చేయాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకం వడ్ల సాగుకు అనుకూలం. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రెండేళ్లనుంచి సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు సన్న ధాన్యం సాగుకు మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉద్యానపంటలు కలిపి 2.24 లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగవుతాయని, అందులో వరి సన్నాలను పూర్తిస్థాయిలో 1,09,854 ఎకరాల్లో సాగుచేసే విధంగా అధికారులు అంచనా రూపొందించారు. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అంతకుముందు గతంలో సన్నాలు 30వేల ఎకరాలకు మించి సాగుచేసిన దాఖలాలు లేవు. సన్నాల సాగుకు, దొడ్డు రకం సాగుకు పంటకాలం స్వల్ప తేడా ఉండటంతో రైతులు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. దొడ్డు రకం కంటే దిగుబడి తక్కువ వచ్చినా బోనస్ ఇస్తుండటంతో కలిసిరానుంది.
అవగాహన కార్యక్రమాలు..
ఈ ఏడాది ప్రతీ రైతు సన్నాలనే పండించాలని కోరుతూ.. ఇటీవల నిర్వహించిన 99 రోజుల ప్రగతి–ప్రణాళికలో భాగంగా రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సన్నాలపై అవగాహన కల్పించారు.
అధికారులు సూచిస్తున్న సన్నాల రకాలు..
ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు, శాస్త్రవేత్తలు రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో 8 రకాల సన్నాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు ఖరీప్ సాగుకు అంచనా మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు తెలుపుతున్నారు. పెద్ద వానలు కురిసిన తర్వాత నార్లు పోసుకోవాలని సూచిస్తున్నారు.
విత్తనాలు పంటకాలం
(రోజులు)
బీపీటీ, 5204 సాంబమసూరి 140–150
ఆర్ఎన్ఆర్ 15048 120–125
కేఎన్ఎం 1638 120–125
జై శ్రీరాం 130–135
హెచ్ఎంటీసోనా 135–145
వరంగల్ 962 125–130
వరంగల్ 44 140–145
జగిత్యాల 1798 120–125


