భూపాలపల్లి: గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో పీసీ పీఎన్డీటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు అమలుపై వైద్య, పోలీసు, ఐఎంఏ, మారి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యసంస్థలు నమోదు ప్రక్రియను పూర్తిచేసి చట్టపరమైన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ కిరణ్, మారి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సదానందం, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, డెమో శ్రీదేవి పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు..
జిల్లాలో బల్క్ భూములు, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి రెవెన్యూ అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు బల్క్ భూముల సర్వే జరుగుతుందని తెలిపారు. సర్వేలో వేగం పెంచి నివేదికలు అందజేయాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, భూపాలపల్లి కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన అధికారులు..
బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన జిల్లా రవాణ శాఖ అధికారి మహమ్మద్ సంధాని, క్వాలిటీ కంట్రోల్ ఈఈ బసవప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి సునీల్ కుమార్ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహించిన కాలంలో అధికారులు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


