రేగొండ: మండలకేంద్రంలోని పలు షాపులను తహసీల్దార్ శ్వేత, ఎస్సై సుధాకర్, ఏఓ వాసుదేవారెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్వేత మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తన డీలర్లు విధిగా స్టాక్ వివరాలు, ధరల పట్టిక రోజు వారిగా నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలను లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచి కొనుగోలు చేసి రశీదు పొంది రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.


