భూపాలపల్లి అర్బన్: ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉండటం సమాజ రక్షణకు అత్యంత కీలకమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎయిడ్స్ నివారణే ఉత్తమ మార్గమని, సురక్షిత జీవన విధానం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ పద్ధతులపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు, అపోహలు దూరం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సురక్షిత జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.., ఎయిడ్స్ వంటి వ్యాధులపై సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, బాధితుల పట్ల వివక్ష, అపోహలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సరైన సమాచారం అందించడం, బాధితుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను తగ్గించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


