భూపాలపల్లి అర్బన్: గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో మూడవ రోజు ‘సేఫ్ మదర్ డే’ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సేఫ్ మదర్ డే కార్యక్రమం ద్వారా గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలపై అవగాహన పెంపొందుతుందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే దిశగా వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని, దీంతో ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. హెల్త్ వీక్ ద్వారా ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి మధుసూదన్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, కౌన్సిలర్లు, వైద్యులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం అస్తవ్యస్తంపై ఆగ్రహం
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్ని పారిశుద్ధ్య అస్తవ్యస్తంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర విభాగం, ల్యాబ్, ఎంఆర్ఐ, ఓపీ విభాగాలను సందర్శించి వైద్యసేవలపై అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం, సిబ్బంది హాజరు విషయంలో మెరుగు పడాలని ఆదేశించారు. నూతన క్యాజువాలిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


