భూపాలపల్లి: ప్రజల రక్షణకు సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈ సెంటర్కు అనుసంధానించామన్నారు. దొంగతనాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విశ్లేషించి త్వరగా నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తాం
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన హోంగార్డు ఎర్రగొల్ల రంజిత్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. బుధవారం హోంగార్డు రంజిత్ మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నరేష్కుమార్, సీఐ నల్ల గట్ల వెంకటేశ్వర్లు, ఆర్ఐలు సంతోష్, రత్నం, హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మొగిళి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


