చిట్యాల: రైతులు ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ సాగు)పై దృష్టి సారించి అధిక దిగుబడులను పొందాలని చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో నేల సారవంతం తగ్గిపోయి పంటల నాణ్యత దెబ్బతినడం, రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయన్నారు. ఏఓ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జీవామృతం, నీమాస్త్రం, అగ్న్యాస్త్రం వంటి సేంద్రియ ద్రావణాల తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చిర్ర సన్నీ, స్వచ్ఛంద సంస్థ జిల్లా నోడల్ అధికారి మణికుమార్, కృషి సఖీలు పింగిలి జ్యోతి, మోత్కూరి గీత, నవాబుపేట సర్పంచ్ పర్లపెల్లి రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


