టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, సమాచార, పంచాయతీరాజ్, రవాణా, విద్యుత్, ఆర్టీసీ, ట్రెజరీ, పోస్టల్, మున్సిపల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1,701 మంది బాలురు, 1,843 మంది బాలికలు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, డీఈఓ రాజేందర్, డీఎంహెచ్ఓ మధుసూదన్, డీటీఓ సంధాని, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మార్క్ అవుట్ పూర్తి చేయాలి..
జిల్లాలో మిగిలిన ఇందిరమ్మ ఇళ్లకు తక్షణమే మార్క్ అవుట్ పూర్తి చేసి, బేస్ లెవెల్ నుంచి రూఫ్ కాంక్రీట్ దశ వరకు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, పీఆర్, మున్సిపల్, ఎంపీడీఓలతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, 2 బీహెచ్కే గృహాల సముదాయాల పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 4,165 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 58 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన 4,107 ఇళ్లలో 898 ఇళ్లు ప్రారంభ దశలో, 582 బేస్ లెవెల్ దశలో, 1,092 రూఫ్ లెవెల్ దశలో, 481 రూఫ్ కాంక్రీట్ దశలో ఉండగా, 1054 ఇళ్లకు మార్క్ అవుట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ..
జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 సంవత్సరం డైరీ, క్యాలెండర్ను సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీలోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పుష్కరాలు విజయవంతం చేస్తాం..
2027లో రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. పుష్కర ఏర్పాట్లపై దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 20 సెంటర్లు,
3,544 మంది విద్యార్థులు
ఇందిరమ్మ ఇళ్లకు
మార్క్ అవుట్ పూర్తి చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ


