విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాలి
భూపాలపల్లి అర్బన్: విద్యా ప్రమాణాల పెంపు, సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలల ద్వారా విద్యా ప్రమాణాలను మరింతగా అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పథకంలో ఎంపిక చేసి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్యార్థులకు సైన్స్, రీసెర్చ్ రంగాల్లో శిక్షణ, క్షేత్ర పర్యటనలు, ఇండస్ట్రియల్ విజిట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు, క్రీడా సామగ్రి, బోధనా సామగ్రి, విద్యార్థులకు ఐడీ కార్డులు, బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్, వృత్తి విద్యా పరికరాలు, చైల్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చర్యలు, విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ (కరాటే) శిక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా అవసరమైన సామగ్రి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
సమగ్ర కార్యాచరణ చేపట్టాలి
వ్యవసాయ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి నూరు శాతం అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్న, చిట్టచివరి రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం కాకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భూసార పరీక్షల ద్వారా సరైన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా కోసం రైతులు యాప్ ద్వారా నమోదుకు రైతు వేడుకల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎరువుల నాణ్యత నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నకిలీ విత్తనాలు, ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్, రమేష్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ


