మల్హర్: చెట్లను కాపాడితేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఏఎమ్మార్ ల్యాండ్ అక్వేషన్ అధికారి మూర్తి, ఇన్విరాల్మెంట్ అధికారి రాజ్కుమార్ అన్నారు. మండలంలోని తాడిచర్ల ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్ల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతిరెడ్డి, కంపెనీ సిబ్బంది అభిషేక్, రామ్మూర్తి, నవీన్, నరేష్ పాల్గొన్నారు.
నియామక పత్రం అందజేత
మల్హర్: మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన దండు రమేశ్ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎన్నికై న విషయం తెలిసిందే. ఈమేరకు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు గురువారం రమేశ్కు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్వప్నరెడ్డి, తిరుపతిరావు, సమ్మయ్య, రమేష్రెడ్డి, శ్రీనివాస్, సదానందం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇన్స్పైర్ మానక్ నామినేషన్లు పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఇన్స్పైర్ మానక్ నామినేషన్లు పూర్తి చేయాలని జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ జూలై 15 నుంచి మొదలైందని.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు తమ పాఠశాలలోని ఐదుగురు విద్యార్థులతో ఐదు నామినేషన్లు పూర్తి చేయించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, రిసోర్స్ పర్సన్ గోనె శ్రీనివాస్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం’
ములుగు రూరల్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చిందని, ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన ఏ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, దళితబంధు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావూద్, రఘుపతి, గ్యానం వాసు, కృష్ణబాబు, రమేష్, రత్నం ప్రవీణ్, హుస్సేన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

చెట్లను కాపాడితేనే పర్యావరణ పరిరక్షణ