
విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హెల్త్ ప్రొఫెల్ తయారు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆస్పత్రికి వచ్చే రోజుల సంఖ్యతోపాటు, ఆస్పత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రిలో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని చెప్పారు., డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరాలు వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా వివిధ గ్రామాల్లోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని నిర్వాహకులు తెలియజేయగా.. వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారికి ఫోన్ చేసి విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లును పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, డాక్టర్ ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంీపీఓ నాగరాజు ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు, పంచాయతీ సెక్రెటరీ శశిధర్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ