
మద్యం తాగించి.. మెడకు తాడుతో బిగించి
రేగొండ: మద్యం తాగించి.. మెడకు తాడుతో బిగించి రవిని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేగొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లేష్తో కలిసి భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పరుష రవికి రేగొండ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహం కాగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఊరైన రామన్నగూడెంలో ఉంటుంది. రవి భూపాలపల్లి జిల్లా గూడాడుపల్లి గ్రామానికి చెందిన పాతపెల్లి రేణుకతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి కొడుకు ఉన్నాడు. రేణుకకు ఇంతకు ముందే మరొకరితో వివాహమై కొడుకు, కూతురు ఉన్నారు. కాగా గత కొంతకాలంగా రేణుక వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రవి ఆమెను శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించినా రవి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో రేణుక తన కొడుకు శ్రీకర్, గ్రామస్తుడు శ్రీపాల్తో కలిసి రవిని హత్య చేయాలని ప్లాన్ వేశారు. దీంతో శ్రీకర్ హనుమకొండకు చెందిన ఉదయ్చందర్ను సంప్రదించి రవిని హత్య చేయడానికి సాయం కోరాడు. ఉదయ్చందర్ తన సమీప బంధువులైన సందీప్, నరేష్లను సంప్రదించి శ్రీకర్తో రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందానికి శ్రీపాల్ ఆర్థిక సాయం అందించాడు. కాగా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టలప్రాంతం హత్యకు అనువైన స్థలంగా ఎంచుకుని ఈ నెల 09న రెక్కీ నిర్వహించారు. 10న రవి మొదటి భార్య కొడుకు విష్ణుకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి కారులో తీసుకెళ్లారు. కొంపల్లి శివారులోని వైన్స్ వద్ద నిందితులు మద్యం తాగినట్టు నటిస్తూ రవికి ఎక్కువ మోతాదులో మద్యం తాగించారు. అర్ధరాత్రి సమయంలో బుగులోని గుట్టల వద్దకు తీసుకెళ్లి రవిని తాడుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. శవాన్ని చెట్ల పొదల్లో పడేశారు. ఆసమయంలో రవి జేబులోని రూ.20 వేలు ఉదయ్చందర్ తీసుకున్నాడు. హత్య కు ఉపయోగించిన తాడును సమ్మక్క గద్దెల వద్ద పడేశారు. కాగా మరుసటి రోజు తానే హత్య చేశాన ని శ్రీకర్ ఒక్కడే లొంగిపోయాడు. కాగా హత్య జరి గిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు శ్రీకర్తోపా టు మరికొందరు ఈ హత్యలో పాల్గొని ఉంటారని భావించి, రవి మొదటి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మండలంలోని చెక్పోస్ట్ వద్ద వాహనలను తనిఖీ చేస్తుండగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చా యి. నిందితుల నుంచి ఆరు సెల్ ఫోన్లు, కారు, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన సీఐ మల్లేష్, ఎస్సై సందీప్కుమార్, సిబ్బందిని డీఏస్పీ అభినందించారు.
రవిని హత్య చేసిన నిందితులు
ఆరుగురి అరెస్ట్, రూ.5 వేలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పోలీసులు