పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకుంది. సర్పంచ్ బండి శ్రీనివాస్గౌడ్, వార్డుసభ్యులు మాట్లాడుతూ, తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రావద్దని, విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలేని కారణంగా మూసివేసే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వ పాఠశాలను బతికించుకునేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరా రు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓడ్నాల జ్యోతి–రాజు, వార్డు సభ్యులు సంకరి కుమార్, జూపాక వెంకటేశ్, సంతపూరి లింగమూర్తి, నెరువట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పోక్సోకేసులో 20 ఏళ్లు.. హత్యకేసులో జీవిత ఖైదు
● రెండు కేసుల్లో ఒకే నిందితుడికి శిక్ష
సిరిసిల్ల: జిల్లాలో రెండు కేసుల్లో ఒకే నిందితుడికి శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికు చెందిన బండపల్లి నవీన్ అనే చందుర్తి మండలం మూడపల్లికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించి కోర్టులో చార్జిషీట్ వేశారు. వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో నమోదైన అదే మైనర్ బాలిక హత్యకేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి టౌన్ సీఐ వెంకటేశ్ కేసు నమోదు చేసి, బండపల్లి నవీన్ను అరెస్ట్ చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీందర్ నాయుడు, చందుర్తి, వేములవాడ కోర్టు కానిస్టేబుళ్లు లతీఫ్, మహేందర్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సోకోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ నేరం రుజువు కావడంతో నవీన్కు పొక్సో కేసులో 20 ఏళ్లు జైలు, రూ.7వేల జరిమాన, హత్యకేసులో జీవిత ఖైదుతో పాటు రూ.5వేలు విధిస్తూ తీర్పునిచ్చారు. రెండు కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులను, ఎస్పీ మహేశ్ బిగితే సిబ్బంది అభినందించారు.


