రాయికల్: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కె.పావ ని సోమవారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెతో అభిషేకాలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చ శ్రీధర్ ఆమెను సన్మానించారు. అర్చకులు సతీశ్శర్మ ఉన్నారు.
ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
జగిత్యాలక్రైం: ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్ అన్నారు. పట్టణంలోని కొత్తబస్టాండ్, రాజీవ్గాంధీచౌరస్తా, గొల్లపల్లి రోడ్లో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనానికి ఫిట్నెస్తోపాటు, ఇన్సూరెన్స్ ఉండాలని, ప్రతి డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులు ఉండాలని, పరిమితికి మించి విద్యార్థులను తరలించొద్దని సూచించారు. అనుమతులు లేని ఓ వాహనాన్ని సీజ్ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోకు తరలించామని పేర్కొన్నారు.
జేఎన్టీయూలో 17మంది విద్యార్థులకు ఉద్యోగాలు
కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి) విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రతిభ చాటారు. ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో నాలుగుదశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఐటీ, సీఎస్సీ, ఈసీఈ విభాగాలకు చెందిన 17మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి వార్షిక వేతనం రూ.నాలుగు లక్షల వరకు ఉంటుందని ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. ప్లేస్మెంట్ అధికారి సతీష్ కుమార్, ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
వృద్ధులను గౌరవిద్దాం
జగిత్యాలజోన్: వృద్ధులను గౌరవించడం సామాజిక బాధ్యత అని జిల్లా సబ్ జడ్జి, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్ధులు ఒంటరితనానికి గురి కాకుండా కుటుంబసభ్యులే చూడాలన్నారు. వారికి హాని కలిగేలా చేస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నా రు. ఇటీవల వృద్ధులు కోర్టులు, పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. వృద్ధులకు అన్యాయం జరిగితే న్యాయసేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిటైర్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖరబూజ రవీందర్, మెట్ట మ ల్లికార్జున్ ప్రధాన కార్యదర్శులు కొలిచాల రవీందర్, కంటే అంజయ్య, కోశాధికారులు గుండేటి గంగాధర్, వేల్పుల ప్రతాప్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో మెరుగైన విద్యకు ప్రభుత్వం కృషి
మెట్పల్లి: పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. పట్టణంలోని శివాజీనగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్ను ప్రారంభించారు. పది ఫలితాలు, అథ్లెటిక్స్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఈ ఏడాది నుంచి అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించిందన్నారు. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్చైర్మన్ ఓంకారి నవీన్, ఎంఈవో కనకతార, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు రైసుద్దీన్ తదితరులున్నారు.


