● నాటి జ్ఞాపకాలు మధురమైనవి ● చదువుతోనే మంచి భవిష్యత్
జగిత్యాల: పాఠశాలకు తొలిరోజు వెళ్లడం ఎంతో అనుభూతినిస్తుంది. మరిచిపోలేని మధురక్షణం. నాన్నకానీ, అమ్మకానీ స్కూల్కు తీసుకెళ్తున్నప్పుడు కొంత భయం ఉంటుంది. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖులు ‘సాక్షి’తో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.
పాఠశాలకు మొదటి రోజు వెళ్లడం ఉత్సాహంగా ఉండేది. ఎక్కువగా అమ్మ నిర్మల స్కూల్కు తీసుకెళ్లేది. విజయనగరంలో ఒకటి నుంచి 4వ తరగతి వరకు.. విశాఖపట్నంలో ఎస్ఎఫ్ఎస్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. సెలవుల అనంతరం వెళ్తే కొత్త బుక్కులు, కొత్త యూనిఫాం.. ఆ మధుజ్ఞాపకం మరిచిపోలేనిది. విద్యతోనే అభివృద్ధి. ప్రతిఒక్కరూ చదువులో రాణించాలి.
– సత్యప్రసాద్, కలెక్టర్
నా చదువంతా గంగాధరలో కొనసాగింది. స్కూల్కు నాన్న మల్లయ్యనే తీసుకెళ్లేవారు. తొలిరోజు స్కూల్కు వెళ్లడమంటే ఆ ఉత్సాహమే వేరు. గురువులు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవారు. ఉపాధ్యాయుల చొరవతోనే ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోంది. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్స్, ల్యాబ్స్ ఎన్నో వచ్చాయి.
– మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల
జగిత్యాలలోని వీక్లీబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతగా చెప్పేవారు. ఆ అనుభూతి వేరు. స్కూల్లో స్నేహితులతో కలిసి అనేక ఆటలు ఆడేవాడిని. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని డాక్టర్ అయ్యాను. ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అయ్యాను.
– ఎమ్మెల్యే సంజయ్కుమార్


