‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

జగిత్యాల: నేషనల్‌ ఎల్జిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్‌ లత తెలిపారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. ఆమె ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈనెల 21న నిర్వహించే పరీక్షకు నాచుపల్లి జేఎన్‌టీయూలో రెండు, ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) కళాశాలలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 807 మంది పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, దివ్యాంగులకు మధ్యాహ్నం 2నుంచి 6.15 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

అర్హులందరికీ పథకాలు

జగిత్యాలరూరల్‌: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని అదనపు కలెక్టర్‌ రా జాగౌడ్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం పొలాసలో ప్రజాపాలన – ప్రగతి ప్రణా ళిక గ్రామసభలో మాట్లాడారు. పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించా లన్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. యువ త సన్మార్గంలో పయనించి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. రూరల్‌ సీఐ సుదాకర్‌, ఎస్సై ఉమాసాగర్‌, తహసీల్దార్‌ హకీం, ఎంపీడీవో రాజేశ్వరి, సర్పంచ్‌ మిల్కూరి శంకరయ్య పాల్గొన్నారు.

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

మల్లాపూర్‌: విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ సమస్య లేకుండా చూస్తున్నామని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మండలంలోని మొగిలిపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌ను శనివారం ప్రారంభించారు. జగిత్యాల సర్కిల్‌ పరిధిలో 118 సబ్‌ స్టేషన్లు ఉన్నాయని, అందులో 36 స్టేషన్లలో ఇంటర్‌ లింకింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా వినియోగదారులు, రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించే అవకాశం ఏర్పడిందన్నారు. ఆయన వెంట ట్రాన్స్‌కో డీఈలు మధుసూదన్‌, గంగరాం, ఏడీఈ అమరేందర్‌, రాఘవపేట ఏఈ సంతోష్‌, సబ్‌ ఇంజినీర్లు, సిబ్బంది ఉన్నారు.

బ్రెయిన్‌ ట్యూమర్‌పై అవగాహన అవసరం

జగిత్యాల: బ్రెయిన్‌ ట్యూమర్‌ వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికై నా వస్తుందని, దానిపై అవగాహన అవసరమని న్యూరో సర్జన్‌ రాజీవ్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ మెడికవర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. చాలా సందర్భాల్లో ఇవి నాన్‌ కాన్సరస్‌లా ఉంటుందని, మొదట్లో లక్షణాలు గుర్తించకుండా ఆలస్యం చేస్తే ఇబ్బంది తప్పదన్నారు. మొదట్లోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుందన్నారు. నిరంతరం తలనొప్పి, తలతిరగడం, చూపు మసకబారడం వంటి లక్షణాలుంటే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ మేనేజర్‌ కోట కరుణాకర్‌, చంద్రశేఖర్‌, సాయితేజ పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో

ప్రముఖుల పూజలు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని శనివారం కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా, మాజీమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, చంద్రశేఖర్‌, అశోక్‌, ఏఎస్సై రమణా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement