ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన దీటి రాజయ్య (52) శనివారం ప్రమాదవశాత్తు భవ నం పైనుంచి కిందపడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజయ్య శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి భవనంపై నిద్రించారు. వేకువజామున మూత్ర విసర్జనకు లేచి భవనం మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రగాయాలతో స్పృహతప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య బాలవ్వ, కుమారుడు, ఇద్దరు కూతు ర్లు ఉన్నారు. కడు పేదరికం అనుభవిస్తున్న మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ కోరారు.
గోడకూలి వృద్ధుడు..
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన బొబ్బిలి పోచాలు (65)శనివారం ప్రహరీ కూలి మరణించాడు. పోచాలు ఇంటిఎదుట గోడ ఇప్పటికే ఒకవైపు వంగిఉంది. పడిపోకుండా దానికి కర్రను సపోర్టుగా పెట్టాడు. గోడ సమీపంలోనే పడ్డ ఎలుకను పోచాలు తీస్తూ పైకిలేచే ప్రయత్నంలో సపోర్టు కర్రను పట్టుకున్నాడు. కర్ర కిందపడటంతో గోడ సిమెంట్ ఇటుకలు పోచయ్యపై పడి మరణించాడు. ఉపాధిహామీ పనులకు వెళ్లిన భార్య నర్సమ్మ.. పోచయ్య కనిపించక పోవటంతో స్థానికులను ఆరాతీసింది. అయినా ఆచూకీ లభించలేదు. అనుమానంతో గోడఇటుక పెళ్లల్లో చూడగా.. పోచయ్య దుస్తులు కనిపించాయి. వెంటనే వాటిని తీయగా అప్పటికే మరణించి కనిపించాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


