రామడుగు/కొత్తపల్లి: వ్యవసాయంలో అప్పులు, అనారోగ్యంతో కొత్తపల్లికి చెందిన కౌలు రైతు చెక్కల అంజయ్య(65) క్రిమిసంహారక మందుతాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై కె.రాజు వివరాల మేరకు కొత్తపల్లి చెందిన కౌలు రైతు అంజయ్య పంటనష్టం, అప్పులు, అనారోగ్యంతో రామడుగు మండలం దేశ్రాజ్పల్లి శివారులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య
ధర్మారం: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్(37) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంకటేశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల స్వగ్రామం వచ్చినా మద్యం తాగడం ఆపలేదు. ఇందుకోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారిలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్నాడు. గ్రామశివారులో పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే మంగళవారం మరణించాడు. ఈమేరకు మృతుడి భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
దొంగతనం కేసులో ఒకరి అరెస్టు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్ పరిధిలోని ఒకఇంట్లో దొంగతనం చేసిన తిరునాహరి రాజును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి 9.30 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కానిస్టేబుళ్లు అనిల్, శివకుమార్, నితిన్, రామకృష్ణ, వంశీ పాల్గొన్నారు.
హత్యాయత్నం చేసిన భర్త రిమాండ్
ధర్మపురి: క్షణికావేశంలో భార్యపై పెట్రోలు పోసి నిప్పటించిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ధర్మపురిలోని ఎస్సీకాలనీకి చెందిన బడగు నవీన్కు మండలంలోని తుమ్మెనాలకు చెందిన మసీదు రమ్యతో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివా హం జరిగింది. కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడి రమ్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రమ్యపై భర్త కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి నవీన్, రమ్య వద్దకు వెళ్లి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. వెంటనే స్థానికులు 108లో జగిత్యాల, పరిస్థితి విషమించడంతో వరంగల్కు తరలించారు. బాధితురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి నవీన్ను రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు.


