పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ బస్టాండ్ సమీపంలో ఫోర్లైన్ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో దంపతులు ఎడ్ల శ్రీనివాస్(44), రజిత(40) దుర్మరణం చెందారు. బసంత్నగర్ ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ తన భార్య రజితతో కలిసి ఈనెల 15న హైదరాబాద్లోని తమ బంధువుల గృహ ప్రవేశ వేడుకకు కారులో వెళ్లారు. ఈనెల 16న సాయంత్రం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని కరీంనగర్లో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుచున్న తన కూతురు రిషిత వద్దకు వెళ్లారు. ఆమెతో కాసేపు సరదాగా గడిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తమ కారులో మంచిర్యాలకు బయలుదేరారు. బసంత్నగర్ బస్టాండ్ దాటిన తర్వాత ఫోర్లేన్ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు హెచ్కేఆర్ టోల్ప్లాజా అంబులెన్స్ సిబ్బంది, ఎస్సై శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కూతురు రిషిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతులకు రిషిత ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులను కోల్పోయిన రిషిత రోదనలు మిన్నంటాయి.
దంపతుల దుర్మరణం


