అనారోగ్యంతో మంచానపడిన ఇంటి పెద్ద
శ్మశానవాటికలో వదిలి వెళ్లిన కుటుంబ సభ్యులు
జగిత్యాల క్రైం: అనారోగ్యంతో ఇంటిపెద్ద మంచానపడగా.. అతడు బతికుండగానే శ్మశానవాటికలో వది లేసిన దీనగాథ పలువురిని కన్నీరు పెట్టించింది. పోషణ భారమవుతోందని సొంతింటి వారే శ్మశానవాటిక లో వదిలివెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాం«దీనగర్కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ది నిరుపేద కుటుంబం. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీధర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి మూడు నెలల కిందటే అనారోగ్యం బారిన పడి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. దీంతో భార్య కిరాణం షాపులో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లతో పాటు భర్తను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి శ్రీధర్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ శివారులోని శ్మశానవాటికలో వదిలేసి వెళ్లారు.
శ్మశానవాటికలో ఒంటరిగా ఉన్న శ్రీధర్ను గమనించిన స్థానిక కౌన్సిలర్ భర్త రాము 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. కనికరం లేకుండా ప్రాణం ఉండగానే శ్మశానవాటికలో వదిలేసి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకుని మానవతా దృక్పథంతో శ్రీధర్ను కుటుంబ సభ్యులే పోషించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


