రైతులకు సబ్సిడీపై పనిముట్లు | - | Sakshi
Sakshi News home page

రైతులకు సబ్సిడీపై పనిముట్లు

Jun 22 2025 4:02 AM | Updated on Jun 22 2025 4:02 AM

రైతులకు సబ్సిడీపై పనిముట్లు

రైతులకు సబ్సిడీపై పనిముట్లు

● వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ● రూ.104కోట్లు కేటాయించిన ప్రభుత్వం

మెట్‌పల్లి: కొన్నేళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలు సబ్సిడీపై అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిధులు కేటాయించింది. పథకాన్ని నిలిపివేయడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బండి పడుతున్నారు. ఈ క్రమంలో పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

ఐదేళ్ల క్రితం నిలిపివేత

● వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులకు బదులు యంత్రాల వినియోగంతో రైతులకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతోంది.

● ముఖ్యంగా శ్రమ, కూలీల ఖర్చు తగ్గడంతోపాటు సమయం ఆదా కావడం, దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

● వీటిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై వివిధ రకాల యంత్రాలు, పనిముట్లను రైతులకు అందించాయి.

● ఎస్సీ, ఎస్టీలకు 95శాతం.. మిగిలిన వర్గాలకు 50శాతం సబ్సిడీపై కల్టివేటర్‌, రొటోవేటర్‌, పవర్‌ టిల్లర్‌, వరినాటు, పవర్‌వీడర్‌, పురుగుల మందు పిచికారీ యంత్రాలు పంపిణీ చేశాయి.

● తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017–18 సంవత్సరం వరకు వీటిని అందించి.. తర్వాత పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది.

● అప్పటి నుంచి చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు యంత్రాల కొనుగోలుకు అప్పు చేస్తుంటే.. మరి కొందరు గత్యంతరం లేక సాంప్రదాయ పద్ధతుల్లోనే కష్టాలు పడుతూ సాగు చేస్తున్నారు.

పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం

● నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

● ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు రూ.104కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

● రైతులకు ఉపయోగకరమైన యంత్రాలు, ఇతర పనిముట్లను గుర్తించాలని అధికారులకు సూచించారు.

● నియోజకవర్గాల వారీగా కేటాయింపులు జరిపి వాటిని రైతులకు సబ్సిడీపై అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

● మొత్తంగా ఐదేళ్లుగా నిలిచిపోయిన సబ్సిడీ యంత్రాలు, పనిముట్ల పంపిణీ.. తిరిగి పునరుద్ధరణకు నోచుకుంటుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదేశాలు రావాల్సి ఉంది

వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఆదేశాలు రాలేదు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రాగానే కార్యాచరణను మొదలుపెడుతాం.

– భాస్కర్‌,

జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement