
ఎన్నికల్లో లబ్ధికోసమే రైతుభరోసా
సారంగాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ప్రభుత్వం రైతుభరోసాను రైతుల ఖాతాల్లో జమచేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేస్తోందన్నారు. ఎకరాకు రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.12వేలకు పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500, రూ.4వేల పింఛన్, తులం బంగారం ఎక్కడా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా రైతులు కాంగ్రెస్కు మరోసారి ఓటేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, యూత్ అధ్యక్షుడు మదన్, నాయకులు బాదినేని వెంకటేష్, భైరి మల్లేశం, వొడ్నాల జగన్ తదితరులు పాల్గొన్నారు.