
ఓవర్ టు సీడీఎంఏ
● జగిత్యాలలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి ● 33 అభ్యంతరాల స్వీకరణ ● 12 ఆమోదం.. 21 తిరస్కరణ ● 50 వార్డులతో సీడీఎంఏకు రిపోర్టు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ అనంతరం చుట్టుపక్కల ఉన్న మోతె, లింగంపేట, తిప్పన్నపేట, ధరూర్, తిమ్మాపూర్తో పాటు మరికొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. 38వార్డులతో ఉన్న పట్టణం 48 వార్డులకు పెరిగింది. జనాభా పెరగడం, నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలపడంతో మరో రెండు వార్డులు అనివార్యమయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు డీలిమిటేషన్ ప్రక్రి య చేపట్టారు. ఈనెల 3న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, 4న అభ్యంతరాలు స్వీకరించారు. 12వ తేదీ నుంచి 16 వరకు వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేపట్టారు. శుక్రవారం ఫైనల్ రిపోర్ట్ను సీడీఎంఏకు పంపించారు.
అభ్యంతరాల వెల్లువ
డీలిమిటేషన్లో అభ్యంతరాలు వెల్లువలా వచ్చా యి. పొన్నాల గార్డెన్స్ వెనుకాల ఉన్న వారు లింగంపేటలో కలపాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిలిమిటేషన్ చేపట్టగా ఆ నివాసాలు 25వ వార్డులోనే ఉన్నాయి. దీంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోతె గ్రామంలోని కొన్ని ఇళ్లు జగిత్యాల మున్సిపాలిటీలో చూపిస్తున్నాయి. వారు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మోతె గ్రామంలోని కొన్ని ఇళ్లను మున్సిపాలిటీ నుంచి తొలగించగా వారికి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా 33 దరఖాస్తులు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం 12 దరఖాస్తులకు ఆమోదం చేశారు.
వార్డుకు 1,700 ఓట్లు?
జగిత్యాల మున్సిపాలిటీలో 94,320 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుకు 1700కు పైగా ఓట్లు ఉండేలా డీలిమిటేషన్ చేపట్టారు. 88 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4నుంచి 5వార్డులు వచ్చేలా చూశారు. అయితే చాలా మంది ప్రజలు డీలిమిటేషన్ ప్రక్రియపై అసంతృప్తిగానే ఉన్నారు. రెండు రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్ సైతం సీడీఎంఏ నుంచి వచ్చే అవకాశాలున్నాయి.
ఇక 50 వార్డులు
జగిత్యాల మున్సిపాలిటీ ఇక 50 వార్డులుగా కొనసాగనుంది. జిల్లా కేంద్రం కాకముందు 38వార్డులు ఉన్నప్పటికీ అప్పుడు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడంతో ఆ సంఖ్య 48 వార్డులకు పెరిగింది. తాజాగా నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలపడంతో మరో రెండు వార్డులు పెంచడం జరిగింది. రానున్న ఎన్నికల్లో 50 స్థానాలకు ఆశావహులు పోటీ చేయనున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను అధికారులు 19 రోజుల్లో పూర్తి చేశారు. మున్సిపాలిటీలో వార్డులకు సీరియల్ నంబరు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో బౌండరీలను ఏర్పాటు చేసి చేశారు.
ప్రక్రియ పూర్తి
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేపట్టడం జరిగింది. అభ్యంతరాలను సైతం స్వీకరించి ప్రజలకు అనుగుణంగానే చేపట్టడం జరిగింది. త్వరలోనే అప్రూవ్ వచ్చే అవకాశాలున్నాయి. 48 వార్డులుండగా మరో రెండు వార్డులు పెరగనున్నాయి.
– శ్రీనివాస్, టౌన్ప్లానింగ్ అధికారి, జగిత్యాల

ఓవర్ టు సీడీఎంఏ