
విధుల నుంచి అన్యాయంగా తొలగించారు
● గురుకులం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు రావడంతో తమను విధుల నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డామని ల్యాబ్ అసిస్టెంట్ నిర్మల, కుకింగ్ మాస్టర్ బాలు, ఏఎన్ఎం సుజాత, మరోకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ పాఠశాల ముందు బైఠాయించారు. 20 ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న తమను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పని చేస్తున్న 73 మందిని తొలగించగా, అందులో వీరు కూడా ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని గిరిజన గురుకులం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్ అన్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఆందోళన చేస్తున్న వారికి గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమాకాంత్ అక్కడికి వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ, పాఠశాలలో 20ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తాము విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ఉన్నఫలంగా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు.